ఎదురుగా ముగ్ధ మోహన సౌందర్యం పాల రాతి శిల్పం ఆకృతి లో .. ముజ్జగాలను ఏలే తల్లి ,దశాబ్దాలుగా అజ్ఞాత
వాసం చేస్తున్న జగత్జనని పరమానంద భరితురాలై చిరుమంద హాసం తో దర్శనమిచ్చింది ..
కనులెదురుగా కనిపించిన వైష్ణవీ మాతని చూసిన వారి కనులు ఆనంద భాస్పాలను వర్షిస్తుండగా వారి చేతులు
అప్రయత్నం గా అమ్మవారికి నమస్కరించాయి ..
రచన కళ్ళు ఆర్పకుండా ఆ అమ్మ ని చూస్తుంది .. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి .. ఆమె ని అలానే చూస్తూ ఓ పది
నిమిషాలు గడిపేశారు వారంతా ..
ముందుగా తేరుకున్న యశ్వంత్ .. రచన వైపు చూశాడు .. ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకున్న అతడు , ఆమె
భుజం పై చేయి వేసి .. రచనా .. కంగ్రాట్స్ .. నీ కల నెరవేరింది .. అమ్మ కొన్ని ఏళ్ళ తర్వాత మనకే దర్శన
మిచ్చింది .. మొట్ట మొదటగా మనకే .. ఈ అదృష్టాన్ని మేమంతా నీ వల్లే పొందాము .. అన్నాడు ఆర్ద్రతగా .
అతని మాటలకి చిన్నగా తలూపి మళ్ళి అమ్మ వైపు చూస్తూ ఉండి పోయింది రచన .
నిజమే యశ్వంత్ .. నిజమైన ఆనందాన్ని ఈరోజే అనుభవిస్తున్నట్టు ఉంది .. మన కళ్ళు ఇంతకన్నా సౌందర్యాన్ని
ఇంకెన్నడూ చూడలేదు అనిపిస్తుంది .. అన్నాడు మురారి ఆనందం తో పూడుకు పోతున్న గొంతుతో ..
అవును .. ఈ తల్లి కి ఎంత దయ ? మనకే ఈ అదృష్టాన్ని ప్రసాదించింది .. ఈ జన్మ కి ఇది చాలు .. అన్నాడు శివ .
అమ్మవారింకా నీటిలోనే ఉంది .. ఈ నీరంతా ఎలా పోతుంది .. ? అనుమానం గా అడిగాడు యశ్వంత్ .
నాకు తెల్సు యశ్వంత్ .. నేను ఆ గ్రంథం చదివాను .. దానిలో ఓ చిన్న క్లూ ఉంది .. అది ఒక శ్లోకం .. బాగా
ఆలోచిస్తే గానీ అర్థం కాదు .. అంది రచన వీరి వైపు తిరిగి .
ఏంటి ఆ శ్లోకం అర్థం ? ముగ్గురూ ఒక్కసారే అడిగారు ..
ఆ శ్లోకం అర్థం ఏంటంటే .. దక్షిణాన్ని చూసిన నాడు సోదరి ని తనలో ఇముడ్చుకొనును .. పడమట ని చూడగానే
వాలు జడ సొగసుని చూపు కొనును .. ఉత్తరాన్ని చూడగానే జ్యోతిలా వెలుగు చూపు .. తూరుపు ని చూడగానే
సవతి నొదిలి దయను చూపు .. అని .. అంది రచన .
ఏం అర్థం కాలేదు .. అంటూ తల గోక్కున్నారు .. శివ , మురారి .
ఇందులో ఏదో నిగూ ఢమ్ గా చెప్పబడి ఉంది .. అన్నాడు యశ్వంత్ .
అవును .. అది ఆ విగ్రహం లోనే ఉంది రహస్యమంతా .. అంది రచన .
స్పష్టం గా చెప్పు రచనా .. అన్నాడు మురారి .. ఆసక్తిగా చూసాడు శివ .
అసలు రహస్యం ఏంటంటే .. ఈ విగ్రహం కదులుతుంది .. అంది రచన .
వ్వాట్ ? అన్నారు ముగ్గురూ ఒక్కసారిగా ..
అవును .. అప్పటి శిల్ప కారుల నైపుణ్యం ఇది .. ఇది పాలరాతి శిల్పం ఐనప్పటికీ ఇందులో మధ్యలో సాల గ్రామ
శిల ఉంది .. అది ఒక ఇనుము ఊచ మాదిరిగా .. విగ్రహాన్ని మరియు విగ్రహ ప్రతిష్ట చేసిన పీఠం కి అది కలప బడి
ఉంది .. కాబట్టి విగ్రహాన్ని నాలుగు దిక్కులు చూస్తున్నట్టు గా మనం విగ్రహాన్ని గుండ్రం గా తిప్పవచ్చు ..
అంటే కరెక్ట్ గా విగ్రహాన్ని కుడి వైపు కి తిప్పగానే అంటే దక్షిణ దిశకి .. విగ్రహం దక్షిణ దిశ ని చూస్తుంది .. అక్కడే
రహస్యం ఉంది .. విగ్రహం కింద కొన్ని రంధ్రాలు ఉన్నాయి .. విగ్రహం దక్షిణ దిశకి తిప్పగానే ఆ రంద్రాలకి అడ్డు తొలిగి
ఆ రంధ్రాల గుండా ఈ నీరంతా వెళ్ళిపోతుంది .. ఎందుకంటే .. నీటిని గంగ అంటారు .. గంగాదేవి అమ్మకి సోదరి వరస
అని వారి వైపు చిరునవ్వుతో చూసింది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment